Saturday, July 26, 2014

61వ జాతీయ చలన చిత్ర అవార్డులు (2013) (61 th National Film Awards 2013)

ఏప్రిల్ - 16,2014

డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్‌ఫెస్టివల్స్ 61వ జాతీయ చలన చిత్ర అవార్డులను న్యూఢిల్లీలో ప్రకటించింది. 2013 సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించింది.   
»    ప్రముఖ దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ 310 చిత్రాలను వడపోసి జాతీయ అవార్డులకు ఎంపిక చేసింది. మొత్తం 62 విభాగాల్లో విజేతలను ప్రకటించింది. ఎక్కువ శాతం హిందీ, మలయాళం, మరాఠీ చిత్రాలే అవార్డులు దక్కించుకున్నాయి. మానవ సంబంధాల్ని, సమకాలీన సమస్యల్ని ఆవిష్కరించిన చిత్రాలకే జ్యూరీ పెద్ద పీట వేసింది.   
»    జాతీయ ఉత్తమ చిత్రంగా ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన 'షిప్ ఆప్ థిసియస్' (హిందీ-ఇంగ్లిష్) ఎంపికైంది. ఆనంద్ గాంధీకి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రం. ముగ్గురి కథగా సాగుతూనే అంతర్లీనంగా ఉనికి, జీవితం, మరణాల గురించి చెప్పే చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. గ్రీకు రాజు పేరు మీద తీసిన ఈ సినిమా ఓ చూపులేని ఫొటోగ్రాఫర్, జబ్బుపడిన ఓ ఆధ్యాత్మిక గురువు, కిడ్నీ మార్పిడి చేసుకున్న ఓ స్టాక్ బ్రోకర్ కథలుగా సాగుతుంది.   
»    కళ్లు లేకుండానే మంచి ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ఓ యువతి మనోభావాలు ఆపరేషన్‌తో చూపు వచ్చాక ఎలా మారాయి? దేశంలో జంతువులపై ఔషధ పరీక్షలను వ్యతిరేకించిన ఓ గురువు, తానే జబ్బుపడి తను పోరాడిన వారి సాయమే పొందాల్సి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఓ స్టాక్ బ్రోకర్ ఎవరి కిడ్నీ వల్ల తను బతికాడో తెలుసుకుని ఏం చేశాడు? అనే సున్నితమైన అంశాలను అపురూపంగా, ఆలోచింపజేసేలా ఈ సినిమాను రూపొందించారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో తీసిన ఈ సినిమా ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలాన్ని పొందింది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు చెరో 2.5 లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు.   
»    ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త షాహిద్ అజ్మీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం 'షాహిద్' దర్శకుడు హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కింది. హన్సల్ మెహతా ఈ చిత్రంలో 1992 నాటి బొంబాయి గొడవల్ని, అప్పటి వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించారు.   
»    ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని ఈ సారి ఇద్దరు పంచుకున్నారు. హిందీ చిత్రం 'షాహిద్' లోని నటనకు రాజ్‌కుమార్ యాదవ్, మలయాళ చిత్రం 'పెరారియావతార్‌'కు సూరజ్ వెంజరాముడు అవార్డుకు ఎంపికయ్యారు.   
»    ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా రూపొందించిన 'భాగ్ మిల్కా భాగ్' ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో మిల్కాసింగ్ పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషించాడు. దేశ విభజన వల్ల జరిగిన అల్లర్లలో కళ్లముందే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ విధి వంచితుడు, ప్రాణాల కోసం భారతదేశం పారిపోయి వచ్చిన ఓ వలస బాధితుడు, దొంగతనాలు చేస్తూ, ఎదిగి మారిన మనిషిగా, దేశానికే సైనికుడిగా సేవ చేసినవాడు, అత్యుత్తమ క్రీడాకారుడిగా మారి, అంతర్జాతీయ వేదికలపై పతకాలు అందుకున్నవాడు మిల్కాసింగ్. మిల్కాసింగ్ తన జీవిత కథ హక్కుల్ని కేవలం ఒక్క రూపాయికే సినీ నిర్మాతకు విక్రయించి, సినిమా లాభాల్లో మాత్రం వాటా అడిగాడు. అదికూడా స్వార్థంతో కాదు. తాను పదేళ్లుగా నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్‌కి విరాళంగా. ఈ సినిమా విశేష ఆదరణ పొందిన ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలాన్ని గెల్చుకుంది. దర్శక నిర్మాతలకు రెండేసి లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు.   
»    61వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మన తెలుగు చిత్రం 'నా బంగారు తల్లి' మూడు పురస్కారాలు గెలుచుకుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలవడమే కాక, ఉత్తమ నేపథ్య సంగీతం (శాంతను మొయిత్రా)కు అవార్డు దక్కించుకుంది. తన జీవితాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు చెబుతూ, ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన అంజలి పాటిల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. అంజలి పాటిల్, సిద్ధిఖి, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలతో రూపొందిన చిత్రం 'నా బంగారు తల్లి'. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడుల నేపథ్యంలో దర్శకుడు రాజేష్ టచ్ రీవర్ ఈ సినిమాని రూపొందించారు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చిత్రంలో ప్రస్తావించారు. 'ఇండోనేషియా అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ'లో ఉత్తమ చిత్రంగా, ట్రినిటీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ ఫీచర్ పిల్మ్‌గా 'నా బంగారు తల్లి' అవార్డులు గెలుచుకుంది.   
»    నంద గోపాల్ రచించిన 'సినిమాగా సినిమా' పుస్తకం ఉత్తమ సినిమా పుస్తకంగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. ప్రపంచ సినిమాపై నందగోపాల్ చేసిన అధ్యయన సారమే 'సినిమాగా సినిమా' పుస్తకం. కదిలే బొమ్మలకాలం నుంచి సినిమా ఎలా మాటలు నేర్చింది? ఆ తర్వాత సినిమాకి ఎలాంటి సొబగులు అద్దారు? వాటిమూలంగా ప్రస్తుతం సినిమా ఏ స్థానంలో ఉంది? అనే విషయాల్ని నందగోపాల్ ఈ తెలుగు పుస్తకంలో అక్షరీకరించారు.   
»    'లయర్స్ డైస్' చిత్రంలో పోషించిన కమల పాత్రకు గీతాంజలి థాపా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. గ్లామర్‌తో కాక తన నటనతోనే గీతాంజలి అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.

పురస్కార విజేతలు:
 ఉత్తమ చిత్రం: షిప్ ఆఫ్ థిసియస్ (హిందీ-ఇంగ్లిష్)
 ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా ('షాహిద్ అనే హిందీ చిత్రానికి)
 ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్ యాదవ్‌రావ్ (షాహిద్ - హిందీ); సూరజ్ వెంజరాముడు (పెరారియావతర్ - మలయాళం) ఇద్దరికీ సంయుక్తంగా.
 ఉత్తమనటి: గీతాంజలి థాపా (లయర్స్‌డైస్ - హిందీ)
 ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: భాగ్ మిల్కా భాగ్ (హిందీ)
 ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్ఎల్‌బీ
 ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం నర్గీస్ దత్ అవార్డు: బాలు మహేంద్ర (తలైమురైగల్- తమిళం)
 ఉత్తమ బాలల చిత్రం: కపాల్ (హిందీ)
 ఉత్తమ నేపథ్య గాయకుడు: రూపాంకర్ (జాతీశ్వర్ - బెంగాలీ)
 ఉత్తమ నేపథ్య గాయని: బెలా షిండే (తుహ్యా ధర్మకొంచా - మరాఠీ)
 ఉత్తమ మాటల రచయిత: సుమిత్రభావే (అస్తు - మరాఠీ)
 ఉత్తమ పాటల రచయిత: ఎన్.ఎ.ముత్తుకుమార్ (తంగా మింకాల్ - తమిళం)
 ఉత్తమ నృత్య దర్శకత్వం: గణేష్ ఆచార్య (భాగ్ మిల్కా భాగ్ - హిందీ)
 ఉత్తమ సంగీత దర్శకత్వం: కబీర్ సుమన్ (జాతీశ్వర్ - బెంగాలీ)
 ఉత్తమ సామాజికాంశ చిత్రం: గులాబ్ గ్యాంగ్ (హిందీ)   
»     నాన్ ఫీచర్ సినిమాల విభాగంలో ఇంగ్లిష్ - తెలుగు భాషల్లో తెరకెక్కించిన 'ఓ ఫ్రెండ్ దిస్ వెయిటింగ్' ఉత్తమ ఆర్ట్/ కల్చరల్ సినిమాగా ఎంపికైంది. ఈ సినిమాకి సంధ్యకుమార్, జస్టిన్ మెక్ కార్తీ దర్శకత్వం వహించారు. 'ది లాస్ట్ బెహ్రుపియ' అనే హిందీ చిత్రంతో కలిసి ఈ చిత్రం సంయుక్తంగా పురస్కారానికి ఎంపికైంది.

No comments:

Post a Comment