Sunday, February 15, 2015

ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైన 'భారత పరివర్తన జాతీయ సంస్థ (నీతి ఆయోగ్)' పాలక మండలి తొలి సమావేశం

 ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైన 'భారత పరివర్తన జాతీయ సంస్థ (నీతి ఆయోగ్)' పాలక మండలి తొలి సమావేశం దిల్లీలో జరిగింది.       
» నీతి ఆయోగ్ ఛైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరఫున ముఖ్యమంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. 'సబ్ కా సాథ్.....సబ్ కా వికాస్ (అందరితో కలిసి.....అందరి వికాసం కోసం)' అనే నినాదంతో కేంద్రం-రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలని ప్రధాని పిలుపునిచ్చారు.       
» నీతి ఆయోగ్ కింద ముఖ్యమంత్రులతో మూడు ఉపబృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
ఆ బృందాలివే...ఉపబృందం - 1: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత నిధులతో అమల్లో ఉన్న 66 పథకాల్లో ఏవి కొనసాగించాలి? ఏ పథకాలను రాష్ట్రాలకు అప్పగించాలి? వేటిని పూర్తిగా రద్దు చేయవచ్చు? అనేది ఇది అధ్యయనం చేస్తుంది.
ఉపబృందం - 2: రాష్ట్రాల పరిధిలో నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల కల్పనపై ఇది అధ్యయనం చేస్తుంది.
ఉపబృందం - 3: స్వచ్ఛభారత్ కార్యక్రమం నిరంతరం కొనసాగేలా వ్యవస్థాగతమైన కార్యాచరణను రూపొందించడం ఈ బృందం లక్ష్యం.       
» పేదరికాన్ని పారద్రోలడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ ఉత్పత్తిని పెంచడం కోసం రెండేసి కార్యసాధక బృందాలను (టాస్క్‌ఫోర్స్‌లు) ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలను ప్రధాని కోరారు.       
» ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు సమావేశానికి హాజరయ్యారు.       
» నీతి ఆయోగ్ సమావేశానికి పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు. కీలకమైన ఈ సమావేశంలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.       
» కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ అంశాల్లో నీతి ఆయోగ్ సిఫార్సులు చేస్తుందనీ, వాటిఅమలును ఆయా ప్రభుత్వాలకే వదిలిపెడుతుందని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. శాశ్వత ప్రాతిపదికన పనిచేసే 'భారత జట్టు (Team India)' సహా పరిశోధన, నైపుణ్య సలహాలు లాంటి వివిధ విభాగాలు ఉండే ఈ సంస్థలో నిపుణులు, వివిధ రంగాల ప్రతినిధులు తమ మేధస్సును వినిమోగిస్తారని వివరించింది.