Wednesday, July 23, 2014

భారత 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం

మే - 26 ,2014
¤ భారత 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ న్యూఢిల్లీలోని రైసినాహిల్స్‌లోని రాష్ట్రపతి భవన్ ముందుభాగంలోని విశాల ప్రాంగణంలో నరేంద్ర మోడీతో ప్రమాణ స్వీకారం చేయించారు.      » ఒకనాటి సాదాసీదా చాయ్‌వాలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రభుత్వాధినేత సింహాసనాన్ని అధిష్టించారు.      
» 45 మంది మంత్రులతో నరేంద్ర మోడీ భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భారత రాజకీయాల్లో 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వం కొలువుదీరింది.     
 » 45 మంది మంత్రుల్లో 23 మందికి క్యాబినెట్, 10 మందికి స్వతంత్ర హోదా, 12 మందికి సహాయ మంత్రుల హోదాను కల్పించారు.     
 » తెదేపా నుంచి అశోక్ గజపతి రాజుకు క్యాబినెట్‌లో చోటు కల్పించారు.     
 » నరేంద్ర మోడీతో ప్రారంభమైన ప్రమాణ స్వీకారం జార్ఖండ్ ఎంపీ సుదర్శన్ భగత్‌తో ముగిసింది.      
» సార్క్ సమావేశాల్లో మినహాయించి, బయటెక్కడా కలవని సార్క్ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలంతా ఒక్కచోటికి చేరి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్త రంగు, హంగు తీసుకొచ్చారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూం, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, భూటాన్ ప్రధాని లియోంచెన్ త్సేరింగ్ తాబ్గే హాజరయ్యారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తరపున ప్రతినిధిగా స్పీకర్ షిరిన్ చౌధురి హాజరయ్యారు. సార్క్ దేశ అగ్రనేతలతో పాటు మారిషస్ ప్రధాని నవీన్ రాంచంద్ర గులామ్ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను, ప్రభుత్వాధినేతలను ఆహ్వానించడం ఇదే తొలిసారి.      
» రాష్ట్రపతి భవన్‌లోని పచ్చిక మైదానంలో ప్రధాని ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి. 1990లో చంద్రశేఖర్, 1998లో వాజ్‌పేయి ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివరాలు


 పూర్తి పేరు: నరేంద్ర దామోదర్ దాస్ మోడీ

 జననం: 1950 సెప్టెంబరు 17, వాద్‌నగర్, మోహ్‌సానా జిల్లా, గుజరాత్.
 విద్య: గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పీజీ.
 తల్లిదండ్రులు: దామోదర్ దాస్ మూల్‌చంద్ మోడీ, హీరాబెన్. వీరి ఆరుగురు సంతానంలో మూడోవ్యక్తి నరేంద్ర మోడీ. కౌమార దశలో మోడీ తన సోదరుడితో కలిసి టీస్టాల్ నడిపారు. చాలా చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్‌లో సభ్యుడిగా చేరారు. విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో పూర్తి స్థాయి ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా మారారు.
 భార్య: జశోదాబెన్. 1968లో మోడీ వివాహం జరిగింది.
 రాజకీయ నేపథ్యం: 1995లో అయిదు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా, భాజపా జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో భాజపా ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2001 అక్టోబరులో గుజరాత్ సీఎంగా పదవిని చేపట్టేవరకూ ఈ బాధ్యతలను నిర్వహించారు.      
» 2001 అక్టోబరు 7 నుంచి 2014 మే 22 వరకు 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.      
» 45 మంది సభ్యుల నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు స్థానం లభించింది. నిర్మలా సీతారామన్ మినహా మిగిలిన ఆరుగురు మహిళలకు క్యాబినెట్ హోదా ఇచ్చారు. వీరిలో నజ్మా హెప్తుల్లా, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, ఉమా భారతి, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, స్మృతి జుబిన్ ఇరానీలు ఉన్నారు. నిర్మలా సీతారామన్‌కు సహాయమంత్రి (స్వతంత్ర హోదా) పదవిని ఇచ్చారు.     
 » మోడీ మంత్రి వర్గంలో అతిపిన్న, అతిపెద్ద వయసున్న మంత్రులిద్దరూ మహిళలే. 38 ఏళ్ల స్మృతి ఇరానీ అతిపిన్న వయసున్న మంత్రి. 74 ఏళ్ల నజ్మాహెప్తుల్లా అందరికంటే పెద్ద వయసున్న మంత్రి.

No comments:

Post a Comment