Monday, August 10, 2015

'సామాజిక ఆర్థిక కుల గణన -2011'

జులై - 3,2015

'సామాజిక ఆర్థిక కుల గణన -2011' వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ భారతావనికి సంబంధించి విడుదల చేసిన ఈ వివరాలు గ్రామీణుల దుర్బర పరిస్థితులను కళ్లకు కట్టాయి. పేదల సంక్షేమం కోసం వివిధ పథకాలను మెరుగుపర్చేందుకు ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.      » దేశవ్యాప్తంగా 649 జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ గణన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ దిల్లీలో సంయుక్తంగా విడుదల చేశారు.      » ఈ గణన వివరాలను కాగితరహితంగా రూపొందించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో చేపట్టిన తొలి సామాజిక ఆర్థిక కులగణన ఇది.      » 1931 తర్వాత తొలి సామాజిక ఆర్థిక కులగణన కూడా ఇదే.ముఖ్యాంశాలుకుటుంబాలు      » దేశంలో మొత్తం కుటుంబాల సంఖ్య 24.39 కోట్లు. ఇందులో పల్లెల్లోని కుటుంబాలు 17.91 కోట్లు, నిరుపేద కుటుంబాలు 10.69 కోట్లు ఉన్నాయి.      » 2.37 కోట్ల గ్రామీణ కుటుంబాలు (13.25%) కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న ఒకే గదిలో నివసిస్తున్నాయి.      » 9.16 కోట్ల గ్రామీణ కుటుంబాలు (51.14%) దినకూలిపై ఆధారపడి ఉన్నాయి. 5.39 కోట్ల గ్రామీణ కుటుంబాలు (30.10%) వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. 2.5 కోట్ల కుటుంబాలు (14.01%) ప్రభుత్వ, ప్రైవేట్ కొలువుల్లాంటి వాటిపై ఆధారపడి ఉన్నాయి.      » 3.86 కోట్ల కుటుంబాలు (21.53%) ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, 5.37 కోట్ల కుటుంబాలు భూమిలేని కుటుంబాలుగా ఉన్నాయి. కాయకష్టం ఆధారంగానే వారి జీవనం సాగుతోంది.      » గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి భూమి లేదు.      » ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలు 4.6 శాతమే.      » చెత్త ఏరుకోవడం ద్వారా జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు 4.08 లక్షలు. యాచకవృత్తి, దాన ధర్మాలపై ఆధారపడిన కుటుంబాలు 6.68 లక్షలు.      » దేశవ్యాప్తంగా సగటున ప్రతి కుటుంబంలో సభ్యుల సంఖ్య 4.93 కాగా, ఉత్తరప్రదేశ్‌లో గరిష్ఠంగా ప్రతి ఇంట్లో 6.26 మంది ఉన్నారు.      » దేశవ్యాప్తంగా వికలాంగుల్లో సగటున 0.40% మంది కదల్లేని స్థితిలో ఉన్నారు. దేశంలో 0.27% మంది అంధత్వ సమస్యను ఎదుర్కొంటున్నారు.అక్షరాస్యత      » గ్రామీణ భారతంలో మూడో వంతుకు పైగా ప్రజలు నిరక్షరాస్యులేనని 'సామాజిక ఆర్థిక కుల గణన-2011' వెల్లడించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామాల్లో అక్షరాస్యుల సంఖ్య 64 శాతం కాగా, నిరక్షరాస్యులు 36 శాతం.గ్రామీణ నిరక్షరాస్యులు అధికంగా ఉన్న రాష్ట్రాలు:రాజస్థాన్‌లో అత్యధికంగా 47.58 శాతం గ్రామీణ నిరక్షరాస్యులున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (44.19%), బిహార్ (43.85%), తెలంగాణ (40.42%) నిలిచాయి.గ్రామీణ నిరక్షరాస్యులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు:కేరళ (11.38%), గోవా (15.42%), సిక్కిం (20.12%), హిమాచల్ ప్రదేశ్ (22.05%).ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య: దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్య వరకు చదువుకున్న గ్రామీణ ప్రజల సగటు 13.97%, మధ్యమిక పాఠశాల వరకూ వచ్చిన వారు 13.53 శాతం, డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించినవారు కేవలం 3.45 శాతమేనని వెల్లడైంది.సఫాయీ కర్మచారీలు     దేశంలోని 12 రాష్ట్రాల్లో చేతులతో మలమూత్రాలు ఎత్తే సఫాయీ కర్మచారీలు (మాన్యువల్ స్కావెంజర్లు) లేరని తాజా జనాభా లెక్కల్లో తేలింది.సఫాయీ కర్మచారీలు లేని 12 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హరియాణ, గుజరాత్, దిల్లీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, చండీగఢ్, అసోం, గోవా.    సఫాయీ కర్మచారీలు దేశంలో అత్యధికంగా డామన్ డయ్యూలో 19.94% మంది ఉన్నట్లు తేలింది.ఈ విషయంలో దేశ సగటు 0.10% (18.06 లక్షల కుటుంబాలు)గా ఉంది.ఎస్సీ, ఎస్టీ జనాభా      » దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటున 18.46% ఎస్సీ జనాభా, 10.97% ఎస్టీ జనాభా ఉంది.      » రాష్ట్రాల వారీగా చూస్తే ఎస్సీ జనాభా పంజాబ్‌లో అత్యధికంగా 36.74% ఉంది. తదుపరి స్థానాల్లో ప‌శ్చిమ్‌బంగ‌ (28.45%), తమిళనాడు (25.55%) ఉన్నాయి. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రామాల్లో ఎస్సీలు లేరని తేలింది. ఎస్టీల జనాభా మిజోరంలో అత్యధికంగా 98.79% ఉండగా, లక్షద్వీప్ (96.59%), నాగాలాండ్ (93.91%), తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 1.63 శాతంతో కేరళ చివరి స్థానంలో ఉంది.కులం, తెగ      » కులం, తెగ లేని కుటుంబాలు జాతీయంగా సగటున 2.04% ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇలాంటివి అత్యధికంగా అండమాన్ నికోబార్ దీవుల్లో 36.99% ఉన్నాయి.కుటుంబ సంపాదన      » పల్లెల్లో ఎక్కువ మొత్తం సంపాదించే కుటుంబ సభ్యుడి సంపాదన నెలకు సగటున రూ.5 వేల లోపే ఉన్న కుటుంబాలు 74.49% (13.34 కోట్ల కుటుంబాలు). 1.48 కోట్ల కుటుంబాల్లోని (8.29%) అత్యధిక సంపాదనాపరుడైన వ్యక్తి నెలవారీ సంపాదన మాత్రం రూ.10 వేలుగా ఉంది.      » గ్రామాల్లో నెలవారీ జీతాలొచ్చే ఉద్యోగ కుటుంబాలు 9.68%. నిరక్షరాస్యులైనర 25 ఏళ్ల వయసు పైబడిన సభ్యులున్న కుటుంబాలు 4.21 కోట్లు. సంపాదించగల 18 నుంచి 59 ఏళ్ల వయసు వారు లేని కుటుంబాలు 65.15 లక్షలు.గృహవసతి:      » జమ్మూకశ్మీర్ వాసులు దేశంలో అందరికంటే సువిశాలమైన ఇళ్లలో జీవిస్తున్నారు. మూడు గదులకు పైబడి ఇళ్లు ఉన్నవారి సంఖ్యలో ఈ రాష్ట్ర ప్రజలు ప్రథమస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. ఒక గదిలో తలదాచుకుంటున్నావారు ప‌శ్చిమ్‌బంగ‌లో అత్యధిక మంది ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో 39 లక్షల మందికి మూడు గదులపైన ఇళ్లు ఉన్నట్లు తేలింది. పశ్చిమ్‌బంగలో 83 లక్షల మంది ఒక గది ఇళ్లల్లో ఉంటున్నారు.

      » గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లులేని పేదల సంఖ్య దేశవ్యాప్తంగా 0.09% ఉంది. పట్టణాల్లో ఇళ్లులేనివారి సంఖ్య దేశవ్యాప్తంగా 0.15%గా ఉంది. అరుణాచల్‌ప్రదేశ్, డామన్ డయ్యూ, లక్షద్వీప్‌లోని గ్రామాల్లో, మిజోరం, సిక్కిం, అండమాన్ నికోబార్‌ల్లోని పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారందరికీ ఇళ్లున్నట్లు తేలింది.

జీవనోపాధి:

      » దేశంలో అత్యధికంగా మిజోరాం వాసులు 73.68% మంది వ్యవసాయం ద్వారా సంపాదించుకుంటుండగా, అత్యల్పంగా చండీగఢ్ వాసులు కేవలం 1.35% మంది మాత్రమే దీనిపై ఆధారపడ్డారు. 
     » దేశవ్యాప్తంగా 0.37% మంది భిక్షాటనే ప్రధాన ఆధారంగా జీవిస్తున్నారు. పశ్చిమ్‌బంగలో అత్యధికంగా 1.26% మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

వ్యవసాయ పంపుసెట్లు     
 » దేశవ్యాప్తంగా సగటున 9.87% కుటుంబాలకు వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. దేశంలో పంపుసెట్ల విషయంలో హరియాణ (23.54%) అగ్రస్థానంలో నిలిచింది.

మొబైల్ ఫోన్లు

      » దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 68.35% మందికి మొబైల్ ఫోన్లు ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మొబైల్ ఫోన్ వినియోగం ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 86.63 శాతం కుటుంబాలు సెల్‌ఫోన్లను ఉపయోగిస్తున్నాయి. యూపీ తర్వాత ఉత్తరాఖండ్ (86.60 శాతం), సిక్కిం (84.9 శాతం) ఉన్నాయి. మొబైల్ ఫోన్ వినియోగం అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా, నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్ (28.47%) నిలిచింది.

వివాహం

      » దేశవ్యాప్తంగా పెళ్లయినవారి సంఖ్య సగటున 40.05%. పెళ్లికాని వారి సంఖ్య 36.16%గా ఉంది. దేశవ్యాప్తంగా సగటున 3.46% మంది వితంతువులు ఉన్నారు.

జాతీయ నమూనా సర్వే (2011-12)

ఆగస్టు - 4,2015

¤ జాతీయ నమూనా సర్వే (2011-12)ను కేంద్ర ప్రభుత్వ విడుదల చేసింది.
ముఖ్యాంశాలు
 నేటికీ గ్రామీణ భారత దేశంలో మూడింట రెండొంతుల మందికి గృహ అవసరాలకు వంట చెరకే ప్రధాన వనరుగా ఉంది.

 గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ కేవలం 15 శాతం కుటుంబాలకే అందుబాటులో ఉంది. 67 శాతం కుటుంబాలు వంట చెరకునే వినియోగిస్తున్నాయి.
 పట్టణ ప్రాంతాల్లో వంటకు 68 శాతానికి పైగా ఎల్‌పీజీ పైనే ఆధారపడుతున్నారు.

 జాతీయ సగటుతో పోల్చితే గ్రామీణ విద్యుదీకరణ మినహా ఇతర అంశాల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 67.5 శాతం కుటుంబాలు వంట చెరకుపైనే ఆధారపడి ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇది 93.2 శాతంగా, రాజస్థాన్‌లో 89.3 శాతంగా, ఒడిశాలో 87 శాతంగా ఉంది.
 గృహాలకు వెలుతురు కోసం పట్టణ ప్రాంతాల్లో దాదాపు అన్ని కుటుంబాలకు విద్యుత్ అందుబాటులో ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. బిహార్ గ్రామాల్లో ఇప్పటికీ 73.5 శాతం కుటుంబాలు కిరోసిన్ దీపాలనే వినియోగిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఇది 58.5 శాతం, అసోంలో 43.3 శాతం, జార్ఖండ్‌లో 36.8 శాతం, ఒడిశాలో 32.3 శాతం, పశ్చిమ్‌బంగలో 29.3 శాతం కుటుంబాలు కిరోసిన్ దీపాలనే వినియోగిస్తున్నాయి.

 దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కిరోసిన్ దీపాల వినియోగం 3.2 శాతంగా ఉంది. బిహార్‌లో 17.2 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 10.8 శాతం, అసోంలో 7.9 శాతం, గుజరాత్‌లో 5.2 శాతం, పశ్చిమ బెంగలో 5 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 3.6 శాతం, ఒడిశాలో 3.5 శాతం పట్టణ గ్రామీణులు రాత్రిళ్లు వెలుగు కోసం కిరోసిన్ దీపాలను ఉపయోగిస్తున్నారు.
 గృహ అవసరాలకు విద్యుత్ వినియోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందుంది. గ్రామాలకు విద్యుదీకరణలో జాతీయ సగటు 72.7 శాతం. ఉమ్మడి ఏపీలో 97.6 శాతం ఇళ్లకు విద్యుత్ అందుబాటులో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ (97.4%), కేరళ (96.2%), కర్ణాటక (95.2%), హరియాణ (95.1%), గుజరాత్ (93.2%) ఉన్నాయి.

 పట్టణ ప్రాంతాల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో 95 శాతం పైగా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉంది. ఉమ్మడి ఏపీలో ఇది 98.5 శాతం. 98.8 శాతంతో తమిళనాడు ముందుంది.
 గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ వినియోగానికి సంబంధించి తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 37.2 శాతం గ్రామీణ కుటుంబాలు ఎల్‌పీజీని వినియోగిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో 30.8 శాతంతో కేరళ, 30.5 శాతంతో పంజాబ్ ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో 1.5 శాతం కుటుంబాలు ఎల్‌పీజీని వినియోగిస్తుండగా ఝార్ఖండ్‌లో ఇది 2.9 శాతం, ఒడిశాలో 3.9 శాతంగా ఉంది.

 పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల వంట అవసరాలకు ఎల్‌పీజీ వినియోగంలో హరియాణ రాష్ట్రం ముందుంది. ఈ రాష్ట్రంలో 86.5 శాతం పట్టణ కుటుంబాలు ఎల్‌పీజీని వినియోగిస్తున్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఇది 77.3 శాతం, పంజాబ్ 75.4%, మహారాష్ట్ర 74.5%గా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని పట్టణ ప్రాంతాల్లో 39.8 శాతం కుటుంబాలు మాత్రమే ఎల్‌పీజీని వినియోగిస్తున్నాయి.
 పిడకలు, ఎండబెట్టిన పేడను వంటకు ఇంధనంగా వినియోగించడంలో ఉత్తరప్రదేశ్ ముందుంది. పిడకల వినియోగం యూపీలోని గ్రామాల్లో 33.4 శాతం కాగా పంజాబ్‌లో ఇది 30.3 శాతం. హరియాణలో 24.4 శాతం, బిహార్‌లో 20.8, మధ్యప్రదేశ్‌లో 10.6 శాతంగా ఉంది.

 పట్టణ ప్రాంతాల్లోనూ పిడకలు, ఎండబెట్టిన పేడను వంటకు ఇంధనంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఒడిశా అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో పట్టణ కుటుంబాలు 36.5 శాతం పిడకలను ఉపయోగిస్తున్నాయి. కేరళలో 36.3% కుటుంబాలు, ఛత్తీస్‌గఢ్‌లో 34.7% కుటుంబాలు పిడకలను వంటకు వినియోగిస్తున్నాయి.

Sunday, August 9, 2015

100 బిలియన్ డాలర్లు (రూ.6.50 లక్షల కోట్లు) మూలనిధితో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధు (ఐఎంఎఫ్)లకు పోటీగా బ్రిక్స్ దేశాల సారథ్యంలో కొత్త బ్యాంకు 'ది న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు' (ఎన్‌డీబీ) ప్రారంభోత్సవం

జులై - 21,2015

100 బిలియన్ డాలర్లు (రూ.6.50 లక్షల కోట్లు) మూలనిధితో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధు (ఐఎంఎఫ్)లకు పోటీగా బ్రిక్స్ దేశాల సారథ్యంలో కొత్త బ్యాంకు 'ది న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు' (ఎన్‌డీబీ) ప్రారంభోత్సవం చైనాలోని షాంఘైలో ఘనంగా జరిగింది.      
» వర్థమాన దేశాలు ప్రపంచ బ్యాంకు, ఐఎమ్ఎఫ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ బ్యాంకు ఏర్పాటైంది. వర్థమాన మార్కెట్ల నుంచి పుట్టుకొచ్చిన తొలి అతిపెద్ద ఆర్థిక సంస్థ కూడా ఇదే.     
 » తొలి అయిదేళ్ల పాటు ఎన్‌డీబీ అధ్యక్షుడిగా భారత్‌కు చెందిన కె.వి.కామత్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.      
» కె.వి.కామత్, చైనా ఆర్థికమంత్రి లూ జివే, షాంఘై నగర మేయర్ యాంగ్ షియాంగ్‌లు ఎన్‌డీబీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.     
 » ఎన్‌డీబీకి శుభాకాంక్షలు చెప్పిన తొలి వ్యక్తి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్.     
 » 2012లో దిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో వర్థమాన దేశాలకు ఒక బ్యాంకు ఉండాల్సిన అవసరాన్ని భారత్ నొక్కి చెప్పింది.       
» ప్రాథమికంగా అయిదు వ్యవస్థాపన సభ్య దేశాలు (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కలిసి సమాన నిష్పత్తిలో 50 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.25 లక్షల కోట్లు) మూలధనాన్ని సమకూరుస్తాయి.      
» మరో 100 బిలియన్‌డాలర్ల అత్యయిక నిధి ఈ బ్యాంకుకు మద్దతుగా ఉంటుంది. 41 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.66 లక్షల కోట్లు)ను చైనా సమకూరుస్తుండగా భారత్, రష్యా, బ్రెజిల్‌లు 18 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.2 లక్షల కోట్లు) చొప్పున, దక్షిణాఫ్రికా 5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.25 లక్షల కోట్లు) చొప్పున ఇస్తాయి.      
» ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంకుల తరహాలో ఏ సభ్యదేశానికీ వీటో పవర్ ఉండదు. అయిదేళ్లకోసారి రొటేషన్ పద్ధతిన అధ్యక్ష పదవి మారుతుంటుంది.

భారత్ - బంగ్లాదేశ్ మధ్య కుదిరిన భూ బదలాయింపు ఒప్పందం

ఆగస్టు - 1,2015

¤ భారత్ - బంగ్లాదేశ్ మధ్య కుదిరిన భూ బదలాయింపు ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో దాదాపు 70 ఏళ్లుగా ఏ దేశానికీ చెందని వ్యక్తులుగా కొనసాగిన 51 వేల మందికి తొలిసారిగా గుర్తింపు లభించింది. భారత్ - బంగ్లాదేశ్ మధ్య నివసిస్తూ ఏ దేశానికీ చెందనివారిగా కనీస సౌకర్యాలకు నోచుకోకుండా అవమానాల పాలైన వీరు ప్రస్తుతం తమకు నచ్చిన దేశాన్ని ఎంచుకున్నారు.
       
      
       
       

» ఇరు దేశాల మధ్య 162 ప్రాంతాల బదిలీ జరిగింది. వీటిలో 111 భారత్‌కు, 51 బంగ్లాదేశ్‌కు చెందినవి. ఈ ప్రాంతాల్లో దశాబ్దాలుగా గుర్తింపులేని జీవనం గడిపిన దాదాపు 51 వేల మందిలో 14 వేల మంది భారతీయ పౌరులయ్యారు. వీరు ఇప్పటివరకు నివసిస్తూ వచ్చిన 51 బంగ్లాదేశ్ ప్రాంతాలు (7,110 ఎకరాలు) ప్రస్తుతం భారత్‌లో విలీనమయ్యాయి. అదే విధంగా పశ్చిమ్‌బంగ రాష్ట్రంలోని కూచ్ బెహార్ జిల్లాకు సమీపంలోని 111 భారతీయ ప్రాంతాలు (17,160 ఎకరాలు) ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విలీనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో దాదాపు అందరూ బంగ్లాదేశ్ పౌరులయ్యారు. వెయ్యి మంది మాత్రం భారత్‌లో ఉంటామని ముందుకొచ్చారు.
 » భూ బదలాయింపు అమలు నేపథ్యంలో ఇక వీరందరికీ ఆయా దేశాల పౌరసత్వ పత్రాలు లభించనున్నాయి. తద్వారా పాఠశాల, ఆసుపత్రి, కరెంటు, మంచినీరు లాంటి సౌకర్యాలతో పాటు ఆస్తి కొనుగోలు లాంటి లావాదేవీలకు, ప్రభుత్వోద్యోగాలకు అర్హత లభించనుంది.
» భారత్ - బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్రమోదీ, షేక్ హసీనా సమక్షంలో ఇటీవల ఢాకాలో భారత ప్రధాని బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా 'భూ సరిహద్దు ఒప్పందం' పై సంతకాలయ్యాయి. దీని ఫలితంగానే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
» 1947 నాటి భారత ఉపఖండం విభజన సమయంలో తూర్పు పాకిస్థాన్ (తర్వాతి కాలంలో బంగ్లాదేశ్)కు దగ్గరగా ఉన్న ప్రాంతాలు భారత్‌లో, భారత్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాలు తూర్పు పాకిస్థాన్‌లో చేరాయి. దీనివల్ల చొరబాట్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలు ఏ దేశానికీ చెందనివారైపోయారు. తూర్పు పాకిస్థాన్ 1971లో పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన తర్వాత ఆ దేశ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్, భారత్ ప్రధాని ఇందిరా గాంధీ మధ్య 1974లో భూ ఒప్పందం కుదిరింది. అయితే మరుసటి ఏడాదే షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారు. తదనంతర కాలంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోవడంతో ఈ సమస్య పరిష్కారం కాలేదు.