Sunday, August 24, 2014

భారతదేశ అణు పరీక్షలు.. అణు విద్యుత్ (India's nuclear tests and nuclear power ..)

భారతదేశంలో అణుశక్తి విభాగాన్ని 1954లో ఆగస్టు 3న ముంబై ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. భార త అణుశక్తి సంఘాన్ని 1948లో నెలకొల్పారు. ప్రస్తుత చైర్మన్ రతన్‌కుమార్ సిన్హా. ఈ సంఘం అణుశక్తి విభాగం కింద విధులు నిర్వహిస్తోంది. అణుశక్తి నియంత్రణ బోర్డు (అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్)ను ముంబైలో 1983లో ప్రారంభించారు. ఈ బోర్డు ప్రధాన ఉద్దేశం భారతదేశంలో అణుశక్తి వల్ల మానవులకు, పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడటం. అణు పరిశోధనల కోసం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)ను 1954లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం కూడా ముంబైలోని ట్రాంబేలో ఉంది. ప్రస్తుత బార్క్ డెరైక్టర్ శేఖర్ బసు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం బార్క్ ముఖ్య ఉద్దేశం. భారత అణు కార్యక్రమ పితామహుడైన హోమీ జహంగీర్ బాబా పేరిట బార్క్‌ను నెలకొల్పారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)ను కూడా ఆయనే స్థాపించారు. 

భారతదేశంలో థర్మల్, జల విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన వనరుల తర్వాత అణుశక్తిని నాలుగో అతిపెద్ద విద్యుత్ శక్తి వనరుగా పరిగణిస్తారు.

మహారాష్ర్టలోని రత్నగిరి జిల్లాలో జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును ఫ్రాన్‌‌సలోని ఎరీవా కంపెనీ సహాయంతో నిర్మించాలని తలపెట్టారు. దీని సామర్థ్యం 9,900 మెగావాట్లు. అయితే ఇది 2021లో ప్రారంభం అవుతుంది అని ఎరీవా కంపెనీ చెబుతోంది. జైతాపూర్‌లో మొత్తం ఆరు యూనిట్లు ఉంటాయి.

భారత్, అమెరికా దేశాలు పౌర అణు ఒప్పందంపై 2008లో సంతకాలు చేశాయి. దీంతో భారతదేశానికి విదేశాలు 1974 తర్వాత తిరిగి యురేనియాన్ని సరఫరా చేయడానికి మార్గం సుగమం అయింది. ఎన్‌పీటీపై సంతకం చేయకున్నా భారతదేశానికి ఎన్‌ఎస్‌జీ దేశాలు యురేనియం, అణు సాంకేతిక సరఫరాను తిరిగి ప్రారంభించాయి. అమెరికా తర్వాత మనదేశం వివిధ దేశాలతో పౌర అణు ఒప్పందాలను కుదుర్చుకుంది. అవి.. రష్యా, ఫ్రాన్‌‌స, కజకిస్థాన్, మంగోలియా, నమీబియా, అర్జెంటీనా దేశాలు. ఇవి కాకుండా 2010లో కెనడాతో అణు ఒప్పందంపై సంతకం చేసింది. యురేనియాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో కెనడా కూడా ఒకటి. 2010లోనే బ్రిటన్‌తో కూడా పౌర అణు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఇటీవల దక్షిణ కొరియాతో అణు ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక యురేనియం నిక్షేపాలు (31 శాతం) ఆస్ట్రేలియాలో ఉన్నాయి. 

భారత్‌లో యురేనియం:
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యురేనియం గనుల తవ్వకాలు జరుగుతాయి. ఈ సంస్థ జార్ఖండ్‌లోని సింగ్భమ్‌లో ఉంది. యురేనియం కార్పొరేషన్‌ను 1967లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అణుశక్తి విభాగం కింద పనిచేస్తోంది. యురేనియం నిక్షేపాలు జార్ఖండ్‌లోని జాద్రగడ, భాతిన్, భాగ్‌జాతా, నర్వాపహార్, తురామ్‌దీ, బందూరంగ్ ప్రాంతాలలో ఉన్నాయి. ఇటీవల యురేనియం నిక్షేపాలను ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా తుమ్మలపల్లెలో కనుగొన్నారు. ఇక్కడ 49,000 టన్నుల యురేనియం ఉండొచ్చని అంచనా. అణుశక్తి సంఘం మాజీ చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ తుమ్మలపల్లెలో 1,50,000 టన్నుల వరకు కూడా యురేనియం నిక్షేపాలు ఉండొచ్చని చెప్పారు.

అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ: 
అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ 1957లో వియన్నా (ఆస్ట్రియా రాజధాని)లో ఏర్పడింది. ప్రస్తుత డెరైక్టర్ జనరల్ జపాన్‌కు చెందిన యుకియా అయానో. ఆయన 2009 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఈ సంస్థకు, మాజీ డెరైక్టర్ జనరల్ మహ్మద్ ఎల్‌బరాదీకి సంయుక్తంగా 2005 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఎల్‌బరాదీ ఈజిప్ట్‌కు చెందిన వ్యక్తి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థలో 159 సభ్యదేశాలున్నాయి. భారతదేశం కూడా ఒక సభ్యదేశమే.

భారత అణు పరీక్షలు

Bavithaపోఖ్రాన్-1: 
భారతదేశం తన తొలి అణు పరీక్షను 1974లో మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించింది. దీన్నే ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తారు. బార్‌‌క డెరైక్టర్ రాజారామన్న ఈ అణుబాంబు ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ఈ బాంబు తయారు చేసిన వ్యక్తి పి.కె. అయ్యంగార్. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. భారతదేశం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేయని అతికొద్ది దేశాలలో ఒకటి. పోఖ్రాన్-1 అణు పరీక్ష ఫలితంగా న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ) 1974లో ఏర్పడింది. ఈ దేశాలు భారత్‌కు అణు సరఫరాను నిలిపివేశాయి.

పోఖ్రాన్-2: 
మే, 1998లో భారతదేశం రెండో అణు పరీక్షలను పోఖ్రాన్‌లో నిర్వహించింది. వీటినే పోఖ్రాన్-2 అంటారు. 1998లో మే 11న మూడు, మే 13న రెండు మొత్తం ఐదు అణు పరీక్షలను పరీక్షించారు. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. ఈ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌లుగా ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించిన ఎపిజె అబ్దుల్ కలామ్, అణుశక్తి సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్.చిదంబరం వ్యవహరించారు. పోఖ్రాన్-2కు మరోపేరు ఆపరేషన్ శక్తి. మే 11న జాతీయ సాంకేతిక దినంగా జరుపుకొంటారు.

భారతదేశంలో అణు రియాక్టర్లు..
Bavithaమన దేశంలో మొత్తం 21 అణు రియాక్టర్లు ఉన్నాయి.
  • తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం: ఇది మహారాష్ట్రలో ఉంది. మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయి. మొదటి యూనిట్‌ను 1969, అక్టోబర్ 28న ప్రారంభించారు. దేశంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇదే. మొత్తం 1400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.
  • రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం: రాజస్థాన్‌లో రావత్‌భట్‌లో ఉంది. ఆరు యూనిట్లు ఉన్నాయి. 1180 మెగావాట్ల సామర్థ్యం ఉంది.
  • మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం: ఇది తమిళనాడులోని కల్పక్కంలో ఉంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి పవర్ స్టేషన్. రెండు యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్ సామర్థ్యం 220 మెగావాట్లు.
  • కైగా జనరేటింగ్ స్టేషన్: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 220 మెగావాట్లు.
  • నరోరా అణు విద్యుత్ కేంద్రం: ఇది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఉంది. 220 మెగావాట్ల సామర్థ్యం చొప్పున రెండు యూనిట్లు ఉన్నాయి.
  • కాక్రపార్ అణు విద్యుత్ కేంద్రం: ఇది గుజరాత్‌లోని సూరత్ సమీపంలోఉంది. రెండు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 220 మెగావాట్లు.
  • కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉంది. ఇది మన దేశంలో 21వ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. దీనిలో ఒక యూనిట్ ఉంది. సామర్థ్యం 1000 మెగావాట్లు. 2002లో మార్చి 31న ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 22న విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిని రష్యా సహాయంతో నిర్మించారు. యూనిట్‌లో తయారయ్యే 1000 మెగావాట్ల విద్యుత్‌లో తమిళనాడుకు 562.5 మెగావాట్లు, కర్ణాటకకు 221 మెగావాట్లు, కేరళకు 133 మెగావాట్లు, పుదుచ్చేరికి 33.5 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయిస్తారు. ఎవరికీ కేటాయించకుండా 50 మెగావాట్ల విద్యుత్‌ను ఉంచుతారు. కూడంకుళంలో రెండో న్యూక్లియర్ రియాక్టర్ నిర్మాణంలో ఉంది. దీనిని వచ్చే ఏడాది (2014)లో ప్రారంభించనున్నారు. దీని సామర్థ్యం 1000 మెగావాట్లు. ఇవేకాకుండా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కాక్రపార్ అణు విద్యుత్ కేంద్రంలో మరో రెండు రియాక్టర్లు నిర్మిస్తోంది. వీటితోపాటు రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రంలో మరో రెండు యూనిట్లను ప్రారంభించనుంది.
సంబంధిత సంస్థలు..
  • IGCAR ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ - కల్పక్కం
  • RRCAT రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ - ఇండోర్
  • ECIL ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - హైదరాబాద్
  • IREL ఇండియన్ రేర్ ఎర్‌‌త్స లిమిటెడ్ - ముంబై
  • UCIL యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - సింగ్భమ్
  • NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - ముంబై
  • HWB హెవీ వాటర్ బోర్డ్ - ముంబై
  • NFC న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్ - హైదరాబాద్
  • TIFR టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ - ముంబై
  • SINP సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ - కోల్‌కతా
  • IPR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ - గాంధీనగర్

No comments:

Post a Comment