Sunday, August 17, 2014

"సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కార్యక్రమం" తీరుతెన్నులు

ఒక్క బ్యాంకు ఖాతా కూడా లేని కుటుంబాలు దేశంలో ఏడున్నర కోట్లు ఉన్నాయి. 2018 ఆగస్టుకల్లా ఈ కుటుంబాలతో కనీసం రెండు బ్యాంకు ఖాతాలను తెరిపించే సమ్మిళిత ఆర్థికాభివృద్ధి పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారని ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించారు. ఈ పథకం విజయవంతమైతే ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశ జనాభాలో 58శాతానికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. సంస్థాగత బ్యాంకింగ్‌ రంగం ద్వారా సకాలంలో, తక్కువ ఖర్చుతో రుణాలు, పొదుపు, జమలు, సూక్ష్మ బీమా వంటి ఆర్థిక సేవలను అందించడం సమ్మిళిత ఆర్థికాభివృద్ధి పరిధిలోకి వస్తుంది. భారతదేశంలో అసంఘటిత వ్యాపార సంస్థల సంఖ్యే ఎక్కువని ఆరో ఆర్థిక గణన తేల్చడంవల్ల, ఈ సంస్థలనూ సమ్మిళిత ఆర్థికాభివృద్ధి పరిధిలోకి తీసుకురావలసి ఉంది. దేశంలో మొత్తం 5.85కోట్ల సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలు(ఎస్టాబ్లిష్‌మెంట్స్‌) ఉన్నాయని ఆరో ఆర్థిక గణన తెలిపింది. వీటిలో రిజిస్టరైనవి, కానివి కూడా ఉన్నాయి. వీటిలో అత్యధికం(59.9శాతం) గ్రామాల్లో ఉండగా, అందులో 20.5శాతం కుటుంబేతర సంస్థలే. ఇవన్నీ కలిసి గ్రామాలు, పట్టణాల్లో 12.8కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. దేశంలోని మొత్తం సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల్లో 47.92శాతం ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ల్లోనే ఉన్నాయి.
విస్తరణలో వెనకబాటు 
భారతదేశంలో 1950లో 1.36లక్షల మందికి ఒక బ్యాంకు శాఖ చొప్పున ఉండగా, 2013లో 12,000మంది ప్రజలకు ఒక బ్యాంకు శాఖ ఏర్పడినట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు తెలుపుతున్నాయి. 1969 బ్యాంకుల జాతీయీకరణ తరవాత బ్యాంకింగ్‌ రంగం జోరుగా విస్తరించింది. అదే సమయంలో దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందాయి. ఈ వేగానికి దీటుగా బ్యాంకింగ్‌ విస్తరణ వూపందుకోవలసి ఉంది. 1969 జాతీయీకరణ సమయంలో దేశంలో 8,262 బ్యాంకు శాఖలు ఉండేవి. ఇప్పుడవి 1,15,082కు పెరిగాయి. 1,60,055 ఏటీఎంలు కొత్తగా ఏర్పాటయ్యాయి. దాదాపు 38శాతం బ్యాంకు శాఖలు, 15శాతం ఏటీఎంలు గ్రామాల్లోనే ఉన్నాయి. వీటికి తోడు బ్యాంకులు రెండు లక్షల వ్యాపార ప్రతినిధులను(బిజినెస్‌ కరెస్పాండెంట్లు- బీసీలు) నియమించాయి.
రిజర్వు బ్యాంకు మార్గదర్శక సూత్రాల ప్రకారం 2006 జనవరి 25నుంచి సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధన కృషి ప్రారంభమైంది. అది 2010 నుంచి వూపు అందుకుంది. దీన్ని పునర్వ్యవస్థీకరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నుంచి సమ్మిళిత ఆర్థికాభివృద్ధి పథకాన్ని చేపట్టి, రెండు దశల్లో అమలు చేస్తుంది. మొదటి దశ 2015 ఆగస్టు 14నాటికి, రెండోదశను 2018 ఆగస్టు 14నాటికి పూర్తిచేస్తారు. ఒక గ్రామంలో బ్యాంకు శాఖను ఏర్పాటు చేయడంవల్ల స్థానిక ప్రజల పని పరిస్థితులు, జీవన స్థితిగతులు నాటకీయంగా మారిపోతాయి. గ్రామీణ పేదల్లో ఇరవై నుంచి నలభై శాతం పొదుపు చేస్తున్నా, అవి సంస్థాగత బ్యాంకింగ్‌ రంగానికి ఆమోదనీయమైన రూపంలో ఉండటం లేదు. దీనివల్ల వారు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందలేకపోతున్నారు. గ్రామాల్లోనే బ్యాంకు శాఖలను ఏర్పాటు చేస్తే, వారు అక్కడే పొదుపు చేయగలుగుతారు. బిజినెస్‌ కరెస్పాండెంట్ల వల్ల బ్యాంకింగ్‌ సేవలు వేగంగా, చౌకగా అందుతాయి. ఉదాహరణకు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో బిజినెస్‌ కరెస్పాండెంట్ల ద్వారా అసంఘటిత చిన్న వ్యాపారాలకు రుణాల పంపిణీ 30శాతం నుంచి 40శాతం మేరకు పెరిగింది. అంతకుముందు ప్రైవేటు వడ్డీవ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకున్న వ్యాపారులు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రుణాలు పొందగలుగుతున్నారు. సరకుల సరఫరాదారులకు ఆన్‌లైన్‌ చెల్లింపులు జరపడం, జమలు స్వీకరించడం వంటివి చేస్తూ విలువైన కాలాన్ని ఆదా చేసుకుంటున్నారు. బిజినెస్‌ కరెస్పాండెంట్ల ద్వారా తమ బంధుమిత్రులకు, వ్యాపార సహచరులకు వేగంగా, తక్కువ ఖర్చుతో డబ్బు పంపగలుగుతున్నారు. బిజినెస్‌ కరెస్పాండెంట్లను నియమించిన చోట భారీ లావాదేవీలు జరిగి, చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల దాకా, విద్యావంతుల నుంచి ఉపాధి హామీ కూలీల దాకా అందరూ లబ్ధి పొందుతున్నారు. ఉదాహరణకు కర్నూలు జిల్లా నాగలదిన్నె గ్రామంలో బిజినెస్‌ కరెస్పాండెంట్‌ ద్వారా నెలకు రూ.50లక్షలకు పైనే లావాదేవీలు జరుగుతున్నాయి.
సులువుగా సంస్థాగత రుణాలు 
గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్‌ రంగం ద్వారా రుణాలు అందించి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సిన అగత్యాన్ని తప్పించడం చాలా ముఖ్యం. ఎక్కడ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు విస్తరిస్తాయో అక్కడ ఆర్థిక కార్యకలాపాలూ వృద్ధి చెందుతాయి. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కార్యక్రమం కింద తెరిచే రెండు బ్యాంకు ఖాతాల్లో ఒక్కోదానికి అయిదు వేల రూపాయల ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పించే ప్రతిపాదన ఉంది. పేదల్లో అత్యధికులకు రూ.500నుంచి రూ.15,000వరకు స్వల్పకాలిక రుణాలు అవసరమవుతుంటాయి. వీరికి బ్యాంకు రుణాలు దొరకవు కాబట్టి తాకట్టు వ్యాపారుల వద్ద, బంగారం తనఖా కంపెనీల వద్ద, ప్రైవేటు వడ్డీవ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి చిన్న మొత్తాలను రుణాలుగా తీసుకుని అప్పుల వూబిలో కూరుకుపోతుంటారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి పథకం కింద ఒక్కో కుటుంబానికి రెండు బ్యాంకు ఖాతాలు తెరవడంవల్ల ఒక్కో ఖాతా మీద రూ.5,000 రుణం పొందడానికి పేదలు అర్హులవుతారు. ఇది వారి స్వల్పకాలిక అవసరాలను తీర్చగలదు. తీసుకున్న రుణాలను సక్రమంగా తీర్చివేస్తే మరిన్ని రుణాలు పొందగలుగుతారు. ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితిని కూడా పెంచుకోగలుగుతారు. ఈ బ్యాంకు ఖాతాలను ఆధార్‌ సంఖ్యతో ముడిపెట్టడంవల్ల ఒకవేళ రుణాలను ఎగవేసినట్లయితే బ్యాంకింగ్‌ రంగం నుంచి అన్ని ప్రయోజనాలను కోల్పోతారు. బిజినెస్‌ కరెస్పాండెంట్‌ యంత్రాంగ విస్తరణతో మున్ముందు గ్రామాల్లో రుణాలు, ఇతర బ్యాంకింగ్‌ సౌకర్యాలు వివిధ టెక్నాలజీ మార్గాల్లో అందుబాటులోకి వస్తాయి. కొల్హాపూర్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యాన్ని ఈ సందర్భంగా ఉదహరించాలి. దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్ల బ్యాంకు ఖాతాలను తెరచి కుటుంబానికి రూ.10,000 చొప్పున ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని కల్పించడంవల్ల గ్రామాల్లో పేద కుటుంబాలకు రూ.75,000 కోట్ల నిధులు చేరతాయి. ఈ రుణాలను సక్రమంగా తీర్చివేసినట్లయితే, ఏటా అంతే మొత్తంలో నిధులు బ్యాంకుల ద్వారా గ్రామాలకు అందుతాయి. ప్రైవేటు వడ్డీవ్యాపారులకూ, బ్యాంకులకూ వడ్డీరేట్లలో తేడా 20శాతం ఉంటుందనుకుంటే, ప్రతి పేద కుటుంబం కేవలం వడ్డీ మీద ఏటా రూ.2,400 ఆదా చేసుకోగలుగుతుంది. ఈ లెక్కన ఏడున్నర కోట్ల కుటుంబాలకు ఏటా రూ.15,000కోట్ల పొదుపు ఏర్పడుతుంది. ఈ పొదుపు మొత్తాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తుసేవలకు గిరాకీ పెంచుతాయి. అయితే, బ్యాంకులు కనుక ఖాతాల వినియోగం మీద లావాదేవీలపరంగా, వినియోగ కాలపరంగా పరిమితులు విధిస్తే, మొత్తం ప్రభుత్వ లక్ష్యమే దెబ్బతింటుంది. అలా జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి.
క్షేత్రస్థాయిలోనే సేవలు
సమ్మిళిత ఆర్థికాభివృద్ధి పథకం కింద రుణాలు, బీమా, పింఛను చెల్లింపులు జరుగుతాయి. రెండు మూడు గ్రామాలకు ఒక్కరు చొప్పున మొత్తం యాభైవేల మంది బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమిస్తారు. ఈ-కెవైసి (నో యువర్‌ కస్టమర్‌) పథకం వల్ల సరైన చిరునామా, గుర్తింపు పత్రాలతో బ్యాంకు ఖాతాలను తెరుస్తారు. అన్ని గ్రామీణ కుటుంబాలను సమ్మిళిత ఆర్థికాభివృద్ధి పథకం పరిధిలోకి తెస్తారు. పట్టణ కుటుంబాలకూ ఇది వర్తిస్తుంది. గతంలో ఈ కార్యక్రమ అమలును పూర్తిగా బ్యాంకులకే అప్పగించారు. ఇకపై అది జిల్లా అధికార యంత్రాంగాల విధుల్లో ముఖ్యమైనదిగా ఉంటుంది. బ్యాంకు ఖాతాలు తెరచినవారికి రుణాలు, బీమా కార్డులు ఇస్తారు. దీర్ఘకాలంలో ఈ పథకం కింద సౌకర్యాలన్నీ ఆర్థికంగా జాగ్రత్తలు పాటించేవారికి మాత్రమే లభిస్తాయి. ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం పొందగోరేవారు 'ఆర్థిక అక్షరాస్యత' కార్యక్రమాలకు హాజరు కావలసి ఉంటుంది.
పొంచి ఉన్న సవాళ్లు 
ప్రభుత్వం ఉద్దేశించిన లక్ష్యసాధనకు బిజినెస్‌ కరెస్పాండెంట్లు, టెక్నాలజీ, హార్డ్‌వేర్‌ నిర్వహణ మీద బ్యాంకులకయ్యే ఖర్చును ఎవరు భరించాలన్నది మొదటి సమస్య. అంతకన్నా పెద్దసవాలు బ్యాంకుల వైఖరులను మార్చడం. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి అనేది నష్టదాయక వ్యవహారమని, రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు తప్పనిసరిగా చేపట్టాల్సిన తతంగమని బ్యాంకులు భావిస్తున్నాయి. వాస్తవానికి ఈ పథకం తమ వ్యాపార వృద్ధికి తోడ్పడుతుందని అవి గుర్తించడం లేదు. బ్యాంకింగ్‌ సేవలు, బిజినెస్‌ కరెస్పాండెంట్లు ఉన్న గ్రామాల్లో రుణాల రికవరీ రేటు, డిపాజిట్లు, రుణ వితరణ పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు తేల్చాయి. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో వారం వారం జరిగే సంతలో ఒక ప్రభుత్వరంగ బ్యాంకు 400మంది చిన్న వ్యాపారులతో 'ఫ్లెక్సిబుల్‌ రికరింగ్‌ డిపాజిట్‌' ఖాతాలు తెరిపించింది. వారు తలా రూ.200 నుంచి రూ.1000 వరకు ఈ ఖాతాల్లో నెలవారీ పొదుపు చేస్తున్నారు. కొల్హాపూర్‌ పరిసర గ్రామాల్లో బిజినెస్‌ కరెస్పాండెంట్లు రూ.10లక్షల మేరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సేకరించగలిగారు. కొందరు రూ.50లక్షల డిపాజిట్లనూ సమీకరించారు. చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో ఓ ప్రభుత్వరంగ బ్యాంకు తన బిజినెస్‌ కరెస్పాండెంట్ల ద్వారా 2012-13లో రూ.15లక్షలకు పైగానే రుణాలు ఇవ్వగలిగింది. దూరదృష్టి, సమన్వయం, సమర్థ వ్యాపార నమూనా ఉంటే ఇటువంటి విజయాలు ప్రతి గ్రామంలోనూ సాకారమవుతాయి. బిజినెస్‌ కరెస్పాండెంట్లకు చక్కని ప్రతిఫలం లభించడమూ ముఖ్యమే. పైన చెప్పుకొన్న కేసుల్లో వీరికి నెలకు రూ.7,000 నుంచి రూ.25,000 వరకూ ప్రతిఫలం అందిన సంగతిని విస్మరించలేం. బిజినెస్‌ కరెస్పాండెంట్ల ద్వారా ఎక్కువ సేవలు అందించినప్పుడు సహజంగానే వారి పెట్టుబడులు, కమిషన్లు, ఆదాయాలు పెరుగుతాయి. కొల్హాపూర్‌ బిజినెస్‌ కరెస్పాండెంట్‌ నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నాడు కనుక మూడు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. కర్నూలు జిల్లా బీసీ నాలుగు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు. ప్రభుత్వం, బ్యాంకులు సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధనకు ఇలాంటి వ్యక్తుల మీద ఆధారపడాలి తప్ప, కార్పొరేట్ల మీద కాదు. బ్రాడ్‌బ్యాండ్‌ యంత్రాంగం, ఇతర సాంకేతిక అనుసంధానాలను గ్రామాలన్నింటికీ విస్తరించడానికి వీలుగా ప్రభుత్వం ట్రాయ్‌ని కూడా సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామిని చేయాలి. గతంలో చేపట్టిన కార్యక్రమాలు ఎందుకు విఫలమయ్యాయో తెలుసుకుని, ఆ పొరపాట్లు మళ్ళీ చేయకుండా పకడ్బందీగా నిర్వహించాలి. అప్పుడే సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కార్యక్రమం పేదల ఆదాయాలను గణనీయంగా పెంచగలుగుతుంది.

No comments:

Post a Comment