Monday, September 7, 2015

సామాజిక ఆర్థిక కుల గణన -2011

జులై - 3,2015

'సామాజిక ఆర్థిక కుల గణన -2011' వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ భారతావనికి సంబంధించి విడుదల చేసిన ఈ వివరాలు గ్రామీణుల దుర్బర పరిస్థితులను కళ్లకు కట్టాయి. పేదల సంక్షేమం కోసం వివిధ పథకాలను మెరుగుపర్చేందుకు ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.      

» దేశవ్యాప్తంగా 649 జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ గణన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ దిల్లీలో సంయుక్తంగా విడుదల చేశారు.      
» ఈ గణన వివరాలను కాగితరహితంగా రూపొందించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో చేపట్టిన తొలి సామాజిక ఆర్థిక కులగణన ఇది.      
» 1931 తర్వాత తొలి సామాజిక ఆర్థిక కులగణన కూడా ఇదే.
ముఖ్యాంశాలు
కుటుంబాలు      
» దేశంలో మొత్తం కుటుంబాల సంఖ్య 24.39 కోట్లు. ఇందులో పల్లెల్లోని కుటుంబాలు 17.91 కోట్లు, నిరుపేద కుటుంబాలు 10.69 కోట్లు ఉన్నాయి.      
» 2.37 కోట్ల గ్రామీణ కుటుంబాలు (13.25%) కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న ఒకే గదిలో నివసిస్తున్నాయి.      
» 9.16 కోట్ల గ్రామీణ కుటుంబాలు (51.14%) దినకూలిపై ఆధారపడి ఉన్నాయి. 5.39 కోట్ల గ్రామీణ కుటుంబాలు (30.10%) వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. 2.5 కోట్ల కుటుంబాలు (14.01%) ప్రభుత్వ, ప్రైవేట్ కొలువుల్లాంటి వాటిపై ఆధారపడి ఉన్నాయి.      
» 3.86 కోట్ల కుటుంబాలు (21.53%) ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, 5.37 కోట్ల కుటుంబాలు భూమిలేని కుటుంబాలుగా ఉన్నాయి. కాయకష్టం ఆధారంగానే వారి జీవనం సాగుతోంది.      
» గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి భూమి లేదు.      
» ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలు 4.6 శాతమే.      
» చెత్త ఏరుకోవడం ద్వారా జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు 4.08 లక్షలు. యాచకవృత్తి, దాన ధర్మాలపై ఆధారపడిన కుటుంబాలు 6.68 లక్షలు.      
» దేశవ్యాప్తంగా సగటున ప్రతి కుటుంబంలో సభ్యుల సంఖ్య 4.93 కాగా, ఉత్తరప్రదేశ్‌లో గరిష్ఠంగా ప్రతి ఇంట్లో 6.26 మంది ఉన్నారు.      
» దేశవ్యాప్తంగా వికలాంగుల్లో సగటున 0.40% మంది కదల్లేని స్థితిలో ఉన్నారు. దేశంలో 0.27% మంది అంధత్వ సమస్యను ఎదుర్కొంటున్నారు.
అక్షరాస్యత      
» గ్రామీణ భారతంలో మూడో వంతుకు పైగా ప్రజలు నిరక్షరాస్యులేనని 'సామాజిక ఆర్థిక కుల గణన-2011' వెల్లడించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామాల్లో అక్షరాస్యుల సంఖ్య 64 శాతం కాగా, నిరక్షరాస్యులు 36 శాతం.

గ్రామీణ నిరక్షరాస్యులు అధికంగా ఉన్న రాష్ట్రాలు:రాజస్థాన్‌లో అత్యధికంగా 47.58 శాతం గ్రామీణ నిరక్షరాస్యులున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (44.19%), బిహార్ (43.85%), తెలంగాణ (40.42%) నిలిచాయి.


గ్రామీణ నిరక్షరాస్యులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు:కేరళ (11.38%), గోవా (15.42%), సిక్కిం (20.12%), హిమాచల్ ప్రదేశ్ (22.05%).


ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య: దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్య వరకు చదువుకున్న గ్రామీణ ప్రజల సగటు 13.97%, మధ్యమిక పాఠశాల వరకూ వచ్చిన వారు 13.53 శాతం, డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించినవారు కేవలం 3.45 శాతమేనని వెల్లడైంది.

సఫాయీ కర్మచారీలు     దేశంలోని 12 రాష్ట్రాల్లో చేతులతో మలమూత్రాలు ఎత్తే సఫాయీ కర్మచారీలు (మాన్యువల్ స్కావెంజర్లు) లేరని తాజా జనాభా లెక్కల్లో తేలింది.

సఫాయీ కర్మచారీలు లేని 12 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హరియాణ, గుజరాత్, దిల్లీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, చండీగఢ్, అసోం, గోవా.    సఫాయీ కర్మచారీలు దేశంలో అత్యధికంగా డామన్ డయ్యూలో 19.94% మంది ఉన్నట్లు తేలింది.ఈ విషయంలో దేశ సగటు 0.10% (18.06 లక్షల కుటుంబాలు)గా ఉంది.


ఎస్సీ, ఎస్టీ జనాభా      

» దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటున 18.46% ఎస్సీ జనాభా, 10.97% ఎస్టీ జనాభా ఉంది.      
» రాష్ట్రాల వారీగా చూస్తే ఎస్సీ జనాభా పంజాబ్‌లో అత్యధికంగా 36.74% ఉంది. తదుపరి స్థానాల్లో ప‌శ్చిమ్‌బంగ‌ (28.45%), తమిళనాడు (25.55%) ఉన్నాయి. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రామాల్లో ఎస్సీలు లేరని తేలింది. ఎస్టీల జనాభా మిజోరంలో అత్యధికంగా 98.79% ఉండగా, లక్షద్వీప్ (96.59%), నాగాలాండ్ (93.91%), తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 1.63 శాతంతో కేరళ చివరి స్థానంలో ఉంది.
కులం, తెగ      
» కులం, తెగ లేని కుటుంబాలు జాతీయంగా సగటున 2.04% ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇలాంటివి అత్యధికంగా అండమాన్ నికోబార్ దీవుల్లో 36.99% ఉన్నాయి.
కుటుంబ సంపాదన      
» పల్లెల్లో ఎక్కువ మొత్తం సంపాదించే కుటుంబ సభ్యుడి సంపాదన నెలకు సగటున రూ.5 వేల లోపే ఉన్న కుటుంబాలు 74.49% (13.34 కోట్ల కుటుంబాలు). 1.48 కోట్ల కుటుంబాల్లోని (8.29%) అత్యధిక సంపాదనాపరుడైన వ్యక్తి నెలవారీ సంపాదన మాత్రం రూ.10 వేలుగా ఉంది.      
» గ్రామాల్లో నెలవారీ జీతాలొచ్చే ఉద్యోగ కుటుంబాలు 9.68%. నిరక్షరాస్యులైనర 25 ఏళ్ల వయసు పైబడిన సభ్యులున్న కుటుంబాలు 4.21 కోట్లు. సంపాదించగల 18 నుంచి 59 ఏళ్ల వయసు వారు లేని కుటుంబాలు 65.15 లక్షలు.
గృహవసతి:      
» జమ్మూకశ్మీర్ వాసులు దేశంలో అందరికంటే సువిశాలమైన ఇళ్లలో జీవిస్తున్నారు. మూడు గదులకు పైబడి ఇళ్లు ఉన్నవారి సంఖ్యలో ఈ రాష్ట్ర ప్రజలు ప్రథమస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. ఒక గదిలో తలదాచుకుంటున్నావారు ప‌శ్చిమ్‌బంగ‌లో అత్యధిక మంది ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో 39 లక్షల మందికి మూడు గదులపైన ఇళ్లు ఉన్నట్లు తేలింది. పశ్చిమ్‌బంగలో 83 లక్షల మంది ఒక గది ఇళ్లల్లో ఉంటున్నారు.      
» గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లులేని పేదల సంఖ్య దేశవ్యాప్తంగా 0.09% ఉంది. పట్టణాల్లో ఇళ్లులేనివారి సంఖ్య దేశవ్యాప్తంగా 0.15%గా ఉంది. అరుణాచల్‌ప్రదేశ్, డామన్ డయ్యూ, లక్షద్వీప్‌లోని గ్రామాల్లో, మిజోరం, సిక్కిం, అండమాన్ నికోబార్‌ల్లోని పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారందరికీ ఇళ్లున్నట్లు తేలింది.

జీవనోపాధి:      

» దేశంలో అత్యధికంగా మిజోరాం వాసులు 73.68% మంది వ్యవసాయం ద్వారా సంపాదించుకుంటుండగా, అత్యల్పంగా చండీగఢ్ వాసులు కేవలం 1.35% మంది మాత్రమే దీనిపై ఆధారపడ్డారు.      
» దేశవ్యాప్తంగా 0.37% మంది భిక్షాటనే ప్రధాన ఆధారంగా జీవిస్తున్నారు. పశ్చిమ్‌బంగలో అత్యధికంగా 1.26% మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

వ్యవసాయ పంపుసెట్లు      

» దేశవ్యాప్తంగా సగటున 9.87% కుటుంబాలకు వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. దేశంలో పంపుసెట్ల విషయంలో హరియాణ (23.54%) అగ్రస్థానంలో నిలిచింది.

మొబైల్ ఫోన్లు      

» దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 68.35% మందికి మొబైల్ ఫోన్లు ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మొబైల్ ఫోన్ వినియోగం ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 86.63 శాతం కుటుంబాలు సెల్‌ఫోన్లను ఉపయోగిస్తున్నాయి. యూపీ తర్వాత ఉత్తరాఖండ్ (86.60 శాతం), సిక్కిం (84.9 శాతం) ఉన్నాయి. మొబైల్ ఫోన్ వినియోగం అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా, నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్ (28.47%) నిలిచింది.

వివాహం     

 » దేశవ్యాప్తంగా పెళ్లయినవారి సంఖ్య సగటున 40.05%. పెళ్లికాని వారి సంఖ్య 36.16%గా ఉంది. దేశవ్యాప్తంగా సగటున 3.46% మంది వితంతువులు ఉన్నారు.

No comments:

Post a Comment