Friday, June 10, 2016

బందీగా బాల్యం!

కైలాస్‌ సత్యార్థి వంటి 'నోబెల్‌' యోధులు బాలల వెట్టిచాకిరి నిర్మూలనకు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటం- అనితరం. కాలం దొర్లిపోతున్నా బందీగా ఉన్న బాల్యాన్ని ప్రభుత్వాలు విడిపించ లేకపోవడమే అసలు విషాదం. బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్ట సవరణ బిల్లునైనా పార్లమెంటులో గట్టెక్కిస్తారేమో చూడాలి...
మానవ హక్కుల ఉల్లంఘనలో అతి పెద్దది, ఎంతో ఘోరమైనది బాల్యాన్ని కబళించడం! బడిలో ఉండాల్సిన పిల్లలు- పొలాల్లో గనుల్లో కార్ఖానాల్లో రెక్కలు ముక్కలు చేసుకునే స్థితి 'మానవతా! నువ్వెక్కడ' అని ప్రశ్నిస్తోంది. జైపూర్‌లో రాళ్లు కొట్టే పని, సూరత్‌లో వజ్రాల చెక్కుడు, అలీగఢ్‌లో తాళాల తయారీ, ఫిరోజ్‌బాద్‌లో అద్దాల పరిశ్రమ, శివకాశిలో బాణసంచా తయారుచేసి విక్రయించే వైనం, తిరువళ్లూరులో ఇటుక బట్టీల్లో కాలిపోయే బతుకులు...ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని నగరం హైదరాబాద్‌కు బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, ఒడిశా, తమిళనాడు, అసోం, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి బాలకార్మికుల తరలింపు కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. దిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, చెన్నైలతో పోల్చిచూస్తే హైదరాబాద్‌లోనూ ఆ కష్టజీవుల సంఖ్య అధికంగా ఉంటోంది! వివిధ పనులతో బతుకులీడుస్తున్న అనేకమంది పిల్లలను ఇటీవల హైదరాబాద్‌లో మెరుపు దాడుల సందర్భంగా అధికారులు గుర్తించారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ పలువురిని వెట్టి నుంచి విముక్తం చేసి తిరిగి స్వస్థలాలకు పంపించారు. వారిలో బిహార్‌తో పాటు ఉత్తర, దక్షిణాది ప్రాంతాలకు చెందిన ఎందరెందరో బాలలున్నారు. బాలలతో చాకిరి చేయించడాన్ని అంతర్జాతీయ సంస్థలు 'దోపిడి వ్యవస్థ'గా, చాలా దేశాలు 'చట్టవిరుద్ధం'గా ప్రకటించాయి. వెట్టి విముక్త బాలబాలికలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు దాదాపు వంద దేశాల్లో రెండు దశాబ్దాలుగా నడుస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఇప్పుడు 'బాలల హక్కుల పరిరక్షణ సంఘాల' నిర్మాణ, నిర్వహణల్లో తలమునకలవుతున్నాయి. జీవనాధార కల్పన, హక్కుల సంరక్షణలే అన్నిటికన్నా ముఖ్యమని కేంద్ర కార్మిక- ఉపాధి కల్పన శాఖ దృఢంగా విశ్వసిస్తోంది. అందుకే పిల్లలతో అలవిమాలిన పనులు చేయించే యజమానులు, తల్లిదండ్రులకు సైతం కారాగారవాస శిక్ష, జరిమానాలు విధించేలా ప్రతిపాదించామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇటీవల ప్రకటించారు.
భారత్‌లో చేయాల్సిందేమిటి?
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొదటినుంచి ఓ సమస్యగా భావిస్తున్నాయే తప్ప సవాలుగా స్వీకరించడం లేదు. రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి లోపించడమే ఇందుకు మూలమన్నది నిస్సందేహం. 'ఓటు బ్యాంకు కాదు' కనుకే పిల్లల బాగోగుల్ని ఏ రాజకీయపక్షమూ పట్టించుకోవడం లేదన్నది నూరుపాళ్లూ నిజం. పేదరికం, నిరక్షరాస్యత, పిల్లల చాకిరి... ఈ మూడింటి చక్రబంధాన్నీ అవగతం చేసుకుంటేనే సమస్య పూర్వాపరాలు తెలుస్తాయి. పరిష్కరించే మార్గాలూ కనిపిస్తాయి. సార్వత్రిక ప్రాథమిక విద్య అమలును కేవలం ఓ ప్రచారాస్త్రంగానో, న్యాయస్థానాలు ఎప్పుడైనా నిలదీసినప్పుడు ప్రభుత్వ 'స్పందన'ను సూచించే కార్యక్రమంగానో వాడుకుంటే అంతకు మించిన ప్రజాద్రోహం మరొకటి ఉండదు. సామాజిక వెనకబాటును ఛేదించేలా ఆ విద్యాప్రక్రియ నిర్మాణ నిర్వహణలు ఉండాలి. ఇకముందైనా దాన్ని 'ప్రచార దశ' నుంచి ప్రజా ఉద్యమ స్థాయికి చేరిస్తేనే పాలనా వ్యవస్థమీద అందరికీ గురి కుదురుతుంది. 'పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు- బడిలో' అని నినదించగానే సరిపోదు. బాలకార్మిక వ్యవస్థను నిషేధించినట్లు ప్రకటించడంతోనే, దానంతట అది దేశంలో మటుమాయమైనట్లు కాదు. సంతానానికి చదువు చెప్పించడం వల్ల ఆ కుటుంబానికి, సంఘానికి, దేశానికి కలిగే ప్రయోజనాలను- ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులకు వివరంగా తెలియజేసే కృషి అత్యవసరం.
ఇందులో ఉపాధ్యాయులతో పాటు విశ్రాంత ఉద్యోగులు, మహిళా కార్యకర్తలు, స్వచ్ఛంద-యువజన సంస్థల సేవలను క్షేత్రస్థాయి నుంచే వినియోగించుకోవచ్చు.
పిల్లల్ని చాకిరి మాన్పించి బడికి పంపిస్తే- పరిహారం ఇస్తామనో పునరావాసం కల్పిస్తామనో హామీలిచ్చినంత మాత్రాన పేదల కష్టనష్టాలన్నీ ఉన్నపళంగా తీరిపోవు. ఆ ముందూ వెనకా ఉన్న అన్ని స్థితిగతులనూ పరిగణించి వ్యవహరించాల్సిన కనీస బాధ్యత పాలకులదే. మరో ముఖ్య కార్యక్రమం- వయో విభజన ఆధారంగా వెట్టి విముక్త బాలలకు వెంటనే విద్యాలయాల్లో ప్రవేశం కల్పించడం. ప్రత్యేక తరగతులు, శిక్షణ కార్యక్రమాలు వెంటవెంటనే నిర్వహిస్తే వారిలో ఆసక్తి, ఆత్మవిశ్వాసం తప్పక పెరుగుతాయి. బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను కచ్చితంగా తేల్చగలిగే సమగ్ర సర్వేలను పకడ్బందీగా నిర్వహించుకోవడం ప్రభుత్వాల కర్తవ్యం. ఉపాధ్యాయులతో పాటు గ్రామీణ యువజన సంఘాలకు ఈ ప్రక్రియలో ఎంత ఎక్కువగా భాగస్వామ్యం కల్పిస్తే అంత బాగా ఫలితాలుంటాయి. సమస్యను పరిష్కరించే తీరు పట్ల స్పష్టత, క్షేత్రస్థాయి అనుభవం కలిగిన ప్రభుత్వేతర సంస్థలతో సమన్వయం అన్నింటికన్నా ప్రధానం. కుటుంబ పరిధితో పాటు చిన్నచిన్న బృందాలుగా పనిచేసే పిల్లలు బాలకార్మిక నిరోధక చట్టం పరిధిలోకి రారన్నది ఇప్పటికీ పలువురు తల్లిదండ్రులు, వ్యాపారుల్లో ఉన్న అభిప్రాయం. దీన్ని ఆసాంతం తొలగించాల్సిన ముఖ్య విధి పూర్తిగా ప్రభుత్వాలదే! అంతేకాక విముక్త బాలలను చదివించేందుకు ముందు నిలిచే కార్పొరేట్‌, ఇతర సామాజిక సేవా సంస్థలకు మార్గదర్శనం చేయాల్సి ఉంది. విద్య, కార్మిక, శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ... ఇలా పలు విభాగాలు అంతటా ఉన్నాయి. ఎవరి పని వారిదిగా, ఎవరి నివేదికలు వారివిగా ఉండటంవల్లే సమస్య నానాటికీ సంక్లిష్టమవుతోంది. వివిధ శాఖలు, సంస్థలు, సంఘాల మధ్య అన్వయం, పరస్పర సహకారం కుదిరేలా ప్రభుత్వం అప్రమత్తత వహించాలి. రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థల ఉమ్మడి కృషే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం!
స్ఫూర్తిదాత బ్రెజిల్‌
వివిధ రూపాల్లోని బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామంటూ అంతర్జాతీయస్థాయి 'డిక్లరేషన్‌'పై సంతకాలు చేసిన దేశాల్లో బ్రెజిల్‌ ఒకటి. చక్కటి భవిత ఆశించి, సంతానాన్ని బడులకు పంపించే పేద తల్లిదండ్రులకు ఆ ప్రభుత్వం అండదండగా నిలుస్తోంది. నగదు బదిలీ పథకం అమలును వూరూవాడా విస్తరించి, అందరి లోగిళ్లలో వెలుగుపూలు పూయిస్తోంది. ఫలితంగా రెండు దశాబ్దాల కాలవ్యవధిలో అక్కడ పాఠశాలలకు బాలల హాజరు శాతం 97శాతానికి పెరిగింది. పిల్లలతో చాకిరిని నిర్మూలించేలా శాసన వ్యవస్థలన్నింటినీ ఏకీకృతం చేయడం, సంబంధిత సంస్థలు- సంఘాల కార్యకలాపాలు అన్నివిధాలా ముమ్మరమయ్యేలా చూడటం ఆ ఘనతకు కారణాలు. విరివిగా అవగాహన శిబిరాలు నిర్వహిస్తూనే, మరో వైపు బాలకార్మిక స్థితిగతులపై ఆ దేశంలో అధికారులు విస్తృత తనిఖీలు సాగించారు. చట్టసంబంధమైన అనేక సంస్కరణలు తెచ్చి, పేదబాలల బతుకుచిత్రం మార్చారు. పిల్లల హక్కుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం, వాటికి భంగం కలిగించిన పరిశ్రమలపై అత్యంత కఠినంగా వ్యవహరించడం... ప్రభుత్వం ఆశించిన ఫలితాలను అనతికాలంలోనే అందించాయి. బాధాకర స్థితుల్లో, అనారోగ్య వాతావరణంలో, ప్రమాదభరిత పనులతో ఉక్కిరిబిక్కిరవుతున్న అభాగ్య బాలలకు అధికారులే కుడిఎడమల అండగా నిలిచారు.

1 comment:

  1. HI guys,I would like to recommend this site for your academics study in secondary and higher secondary education
    http://www.kidsfront.com/

    ReplyDelete