Tuesday, October 21, 2014

స్వచ్ఛ భారత్‌ గురించి పూర్తి వివరాలు (Swachh Bharat Abhiyan)

పారిశుద్ధ్య పథకం 'స్వచ్ఛ భారత్‌'ను గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు.

ముఖ్యాంశాలు     
 » స్వచ్ఛ భారత్ అమలుకు అయ్యే మొత్తం వ్యయం రూ.62,009 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.14,623 కోట్లను అందజేయనుంది.      
» ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 4,041 పట్టణాల్లో అయిదేళ్లపాటు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు.      
» అనారోగ్యం కారణంగా పనిచేయలేక ప్రతి భారతీయుడు ఏటా సగటున రూ.6,500 ను నష్టపోతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందన్నారు.      
» గ్రామీణ ప్రాంతాల పారిశుద్ధ్యానికి సంబంధించి ఇప్పటికే ఉన్న 'నిర్మల్ భారత్ అభియాన్‌'ను స్వచ్ఛ భారత్‌లో కలిపివేయాలని కేంద్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది.      
» ప్రధాని ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం కింద దేశంలోని 2.47 లక్షల గ్రామ పంచాయతీలకు ఏటా రూ.20 లక్షలు చొప్పున అందుతాయి.      
» ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో మోదీ స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు.      
» ప్రధాని ప్రజలందరితో భారత్‌ను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.      
» స్వచ్ఛభారత్ ప్రచారానికి ప్రధాని మోదీ తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో సచిన్ టెండూల్కర్, శశి థరూర్, అనిల్ అంబానీ, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, కమల్ హాసన్, బాబా రాందేవ్, గోవా గవర్నర్ మృదులా సిన్హాతోపాటు టీవీ సీరియల్ 'తారక్ మెహ్తా కా ఉల్టా చష్మా' బృందం ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ మరో తొమ్మిది మందిని ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ప్రధాని సవాల్ విసిరారు. ఆవిధంగా కొత్తగా వచ్చేవారు తమ వంతు బాధ్యతగా తొమ్మిది మందిని తీసుకురావాలని, ఈ విధంగా ఇది కొనసాగుతూనే ఉండాలని పేర్కొన్నారు.      
» దేశ జనాభా 125 కోట్లలో దాదాపు 72.2% మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. మొత్తం గ్రామాల్లోని 16.78 కోట్ల గృహ సముదాయాల్లో కేవలం 5.48 కోట్ల ఇళ్లకే మరుగుదొడ్ల సదుపాయం ఉంది. దీనర్థం 67.3% గ్రామీణ నివాసాల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. ఇది చాలా బాధాకర విషయం అని, దీని వల్ల ప్రజారోగ్యం క్షీణిస్తుందన్నారు.      
» దేశంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి 1986లోనే కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకం (సీఆర్ఎస్‌పీ) ఆరంభించారు. తర్వాత 1999లో సంపూర్ణ పారిశుద్ధ్య పథకం (టీఎస్‌సీ), నిర్మల్ గ్రామ్ పురస్కార్ పథకం మొదలు పెట్టారు. బహిరంగ విసర్జనను 2017 నాటికి పూర్తిగా మాన్పించాలనేది వీటి లక్ష్యం.      
» భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన, అనుసరణీయమైన విధానాలతో స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని పశ్చిమబెంగాల్‌లోని మిడ్నపూర్ జిల్లా దశాబ్దం కిందటే సాధించింది. 'సుస్వాగతం... మా గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉంది. బహిరంగ మల విసర్జన లేదు' అని సాధికారతతో గ్రామాలకు స్వాగత బోర్డులను ఏర్పాటు చేసుకున్న ఘన చరిత్ర మిడ్నపూర్ జిల్లాది. దాదాపు 50 అభివృద్ధి చెందుతున్న దేశాలకు అక్కడి విధానం ఆదర్శంగా నిలిచింది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యానికి 1999లో శ్రీకారం చుట్టి 2004 నాటికి సాధించింది.      
» స్వచ్ఛ భారత్ ప్రచారానికి గాంధీజీ కళ్లద్దాలతో వినూత్నమైన లోగోను రూపొందించిన మహారాష్ట్రకు చెందిన అనంత్‌ను ప్రధాని అభినందించారు.      
» 'ఏక్ కదమ్ స్వచ్ఛతా కీ ఓర్' (స్వచ్ఛత వైపు ఒక ముందడుగు) అనే నినాదానికి రూపకల్పన చేసిన గుజరాత్‌కు చెందిన భాగ్యశ్రీకి ప్రధాని అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment